ఏపీని హడలెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకోలు, తెలంగాణ కు కూడా పాకారు.
తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లాలో తమ ప్రతాపం చూపి, జనాలను ఉలిక్కి పడేలా
చేశారు. వివరాల్లోకి వెళ్తే, కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో బైక్ పై
వెళ్తున్న రైతు వీరయ్యకు సూది గుచ్చిన ముగ్గురు ఆగంతుకులు ఆటోలో
పరారయ్యారు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి
స్థానికులు తరలించారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల
గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఇంజెక్షన్ సైకోల దాడులు
హైదరాబాదుకు కూడా పాకడం కలకలం రేపుతోంది. ఎల్బీనగర్ లో ఈరోజు సైకో దాడి
జరిగింది. ఎల్ఐసీ ఆర్ఎంగా పని చేస్తున్న స్వామి నాయక్ అనే వ్యక్తి బస్సులో
ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు సూదితో పొడిచి పరారయ్యాడు. అనంతరం, స్వామి
నాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు
సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.